(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నియంతృత్వ ధోరణిలోనే ముందుకు వెళుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.బుధవారం ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అయినప్పటికీ ప్రధాన వాటాదారు అయిన కేంద్రాన్ని సంప్రదించకుండా నియంతృత్వ ధోరణితో జగన్ ముందుకు వెళుతున్నారని విమర్శించారు. అధికారం చేపట్టిన నాటి నుండి జగన్ ఇదే ఫందా కొనసాగిస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, పిపిఎ వ్యవహారం తదితర అన్ని అంశాలలోనూ తాను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి అది జరిగి తీరాల్సిందేనన్న మూర్ఘత్వంతో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ పరిపాలనా వికేంద్రీకరణ కాదని కన్నా అన్నారు. భూతల స్వర్గాన్ని చూపిస్తానన్న జగన్ నేడు ప్రజలకు నరకం చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో వైసిపికి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని దెబ్బతీయవద్దని కన్నా సూచించారు. సిఎం మారినప్పుడల్లా రాజధాని మార్చడం రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదని అన్నారు.రాజధాని నిర్మాణం జగన్ వల్ల కాకపోతే తాము చేసి చూపిస్తామని అన్నారు. సీడ్ క్యాపిటెల్ అమరావతిలోనే ఉండాలని కన్నా స్పష్టం చేశారు. గత ప్రభుత్వానిది పోలీస్ పాలనగా ఈ ప్రభుత్వానిది రాక్షస పాలన కన్నా అభివర్ణించారు. జగన్ పాలనలో ఫ్యాక్షనిజం కనిపిస్తోందనీ, ప్రజాస్వామ్యం కనబడటం లేదనీ కన్నా ఆరోపించారు. రాజధాని విషయంలో అవసరమైతే సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు.
జగన్ తన శాడిజానికి రాష్ట్రాన్ని బలిచేస్తున్నారనీ, ఇంత మంది ఆందోళన చేస్తున్నా జగన్ స్పందించడం లేదనీ అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, వ్యాపారాలు తప్ప వైసిపి ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు.
జనసేనతో కలిసి పని చేసే విషయంపై మాట్లాడుతూ పొత్తులు పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయాల మేరకు ఉంటాయన్నారు. రేపు జాతీయ స్థాయి నాయకులు రాష్ట్రానికి విచ్చేస్తున్నారనీ, వారితో జరిగే సమావేశంలో చర్చల అనంతరం విషయాలను వెల్లడిస్తామనీ కన్నా తెలిపారు.