అమరావతి: గత టిడిపి ప్రభుత్వంలో పలు అక్రమాలు జరిగాయనీ వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖలు రాశారు.
వివిధ అంశాలపై రాసిన ఏడు లేఖలను కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు.
రాజధాని భూముల అక్రమాలు, అసైన్డ్ ల్యాండ్ కొనుగోలులో అక్రమాలపై విచారణ జరిపించి, రైతులకు న్యాయం చేయాలని ఒక లేఖలో కన్నా పేర్కొన్నారు. అదే విధంగా గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానంపై ఆలోచన చేయాలనీ, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేసే విధంగా కొత్త ఇసుక పాలసీని తీసుకోవాలని కన్నా కోరారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్వాసితులకు, గిరిజనులకు న్యాయం చేయాలని కన్నా విజ్ఞప్తి చేశారు. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో తొలగించిన హిందు దేవాలయాలను పునరుద్ధరించాలనీ, సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న చుక్కల భూముల సమస్యని వెంటనే పరిష్కరించాలని కన్నా కోరారు. అగ్రిగోల్డ్లో అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని కన్నా విజ్ఞప్తి చేశారు. దేవాలయ భూముల పరిరక్షణ కోసం గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి రాసిన లేఖల్లో కన్నా కోరారు.