(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఇప్పటి వరకూ ఏపి బిజెపి అధ్యక్షుడుగా నియమితులైన సోము వీర్రాజు అధికార వైసీపీకి కాస్త అనుకూలమనీ, టీడీపీకి బద్ద విరోధి అన్నట్లుగా రాష్ట్రంలో ప్రచారం జరిగింది. అయితే సోము వీర్రాజు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారనీ, అవసరమైతే వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి సైతం వెనుకాడరని తాజా సంఘటనలు బట్టి చూస్తుంటే అర్థం అవుతోంది.
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీనర్శింహ స్వామి వారి రథం దగ్ధం సంఘటనను పురస్కరించుకుని ఏపి బిజెపి చీఫ్ సోము వీర్రాజు సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హిందూత్వంపై దాడులు పెరిగాయని మండిపడ్డారు సోము వీర్రాజు. అంతర్వేదిలో ఆలయ రథం దగ్ధంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని విమర్శించారు సోము వీర్రాజు. హిందూత్వంపై దాడులను బి జె పి సహించదని స్పష్టం చేశారు. హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన ప్రతి సారి పిచ్చవాళ్లు చేసిన పని, పిచ్చి చేష్టలు అంటూ తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు సోము వీర్రాజు, హిందూ దేవాలయాలంటే పిచ్చవాళ్లకు ఆట స్థలాలా అని ప్రశ్నించారు. అంతర్వేది ఘటనలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఎం జగన్కు లేఖ రాసినట్లు తెలిపారు.
పనిలో పనిగా టీడీపీపైనా విమర్శలు గుప్పించారు సోము వీర్రాజు. అంతర్వేది ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. కృష్ణా పుష్కరాల పనుల పేరిట విజయవాడలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక దేవాలయాలను కూల్చివేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ హిందూత్వంపై ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇదే సందర్భంలో రాజధాని విషయంపైనా మాట్లాడారు. తమకు అధికారం ఇస్తే 64 వేల ప్లాట్ లు రైతులకు ఇచ్చేసి తొమ్మిది వేల ఎకరాల్లోనే రాజధాని నిర్మించి చూపిస్తామని అన్నారు సోము వీర్రాజు.