విజయవాడ: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని బిజెపి రాష్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధికై బిజెపి ఇసుక సత్యాగ్రహం కార్యక్రమం సోమవారం ధర్నాచౌక్ వద్ద చేపట్టింది. ఈ సత్యాగ్రహంలో కన్నా లక్ష్మీ నారాయణతో పాటు ఆ పార్టీ నేతలు దగ్గుబాటి పురంధరేశ్వరి, కామినేని శ్రీనివాసరావు, కిలారు దిలీప్, షేక్ బాజీ, శ్రీనివాస రాజు, సత్యమూర్తి, చాగర్లమూడి గాయత్రి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ఇసుక కొరతతో లక్షల మంది కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నట్లు ఇసుకకు ముహూర్తం పెట్టారని కన్నా విమర్శించారు. వైసిపి కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడానికి మహుర్తాలు లేవని అన్నారు.
కృష్ణా, గోదావరి వరదలు వస్తే రాయలసీమలో ఇసుక కొరత ఎందుకొచ్చిందని కన్నా ప్రశ్నించారు. బాధితులకు 25లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటే విలేఖరుల సమావేశాలు పెట్టి తిడతారా అని కన్నానిలదీశారు. పోలీసులతో బిజెపి కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని కన్నా ఆరోపించారు.
మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వరదల వల్ల ఇసుక తీయలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతున్న సమాధానం సహేతుకంగా లేదని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టినట్లైయినా లేదని కామినేని విమర్శించారు.
మీడియాపై ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు.ప్రభుత్వ డబ్బులతో పంచాయితీ భవనాలకు వైసిపి జెండా రంగులు ఎలా వేస్తారని కామినేని ప్రశ్నించారు.
వైసిపికి సొంత మీడియా ఉంది, ఒక్కటైనా నిజం రాస్తున్నారా, ప్రజల కష్టాలు పడుతుంటే, పత్రికలలో ఆ కష్టాలు రాకూడదంటే ఎలా అని కామినేని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుని కార్మికుల కష్టాలు తీర్చాలని కామినేని విజ్ఞప్తి చేశారు.