ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్న సామెతగా తయారు అయ్యింది రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని అధికార వైసీపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా బీజేపీ, జనసేన, సిపిఐ, సీపీఎం తదితర పార్టీలు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని మొదటి నుండి డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతాంగానికి సంఘీభావం కూడా తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకుల్లో రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. అమరావతిలో రాజధాని కొరకు భూములు ఇచ్చిన రైతాంగానికి సంఘీభావం తెలిపారు. అమరావతికి మద్దతుగా రాష్ట్ర కమిటీ తీర్మానం కూడా ఆమోదించింది. బీజేపీ నేతలు మద్దతు తెలియచేయడంతో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున తమకు న్యాయం జరుగుతుందని అమరావతి ప్రాంత రైతాంగం ఇప్పటి వరకు ఆశతో ఉన్నారు. అయితే మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంతో బీజేపీపై అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉంచితే..
మూడు రాజధానుల అంశంపై బీజేపీ నేతల మధ్య అగ్గి రాజుకొంటోంది. నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. బీజేపీ నూతన అధ్యక్షుడుగా నియమితులైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. అమరావతి విషయంలో బీజేపీ స్టాండ్ లో ఎటువంటి మార్పు లేదని, రైతులకు అండగా ఉంటామని చెబుతూనే మరో పక్క కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేస్తున్నారు. అదే పార్టీ ఎంపి సుజనా చౌదరి.. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని, రాజధాని అంగుళం కూడా కదలదు అంటూ మరో సారి స్పష్టం చేయడంతో రాష్ట్ర బీజేపీ వెంటనే స్పందించి ట్విట్టర్ వేదికగా సుజనా చౌదరి వ్యాఖ్యలను ఖండించింది. అది ఆయన వ్యక్తి గత అభిప్రాయం అని కూడా కొట్టి పారెయ్యడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అమరావతికి అనుకూలంగా కొందరు, మూడు రాజధానులకు అనుకూలంగా మరి కొందరు బీజేపీ నాయకులు గళం విప్పుతున్నారు.