(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించింది. సమావేశం అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
కొత్త ఇసుక పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్లు అన్నీఒకే సంస్థకు అప్పగించాలని అదీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ముందుకు రాకపోతే బహిరంగ వేలం నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అగ్నిమాపక శాఖలో నాలుగు జోన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకూ రెండు జోన్లుగా ఉన్న అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలను సౌలభ్యం కోసం నాలుగు జోన్లుగా విభజన చేయాలని నిర్ణయించింది. కొన్ని జైళ్లకు సూపర్నిటెండెంట్ పోస్టులు భర్తీకి మంత్రివర్గం ఆమోదించింది.
చిరువ్యాపారులకు చేయూతనందించేందుకు తీసుకువచ్చిన జగనన్న చేదోడు పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కళాశాలలకు భూముల కేటాయింపుతో పాటు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి విస్తరణకు ఆరు ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కన్నబాబు తెలిపారు. విజయవాడలో అనాధాశ్రమం, శిశు భవనం కోసం మిషనరీ ఆఫ్ చారిటీస్కు లీజ్ పద్దతిన భూ కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని కన్నబాబు చెప్పారు. మచిలీపట్నం పోర్టు డీపిఆర్కు ఆమోదం తెలిపింది. రూ.5,835 కోట్లతో 36 నెలల్లో మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, అక్రమ ఇసుక రవాణా, అక్రమ మధ్యం రవాణా, మట్కా, జూదం, మత్తు పదార్థాల విక్రయం, నిషేదిత గుట్కా విక్రయాలను స్టేట్ ఎన్ఫోర్సమెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పరిధిలోకి తీసుకురావడంతో పాటు ఎస్ఈబీని బలోపేతం చేసేందుకు అవుట్ సోర్సింగ్ ద్వారా 71 పోస్టులు, డిప్యుటేషన్ ద్వారా 30 మంది అధికారుల పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదించింది. అదే విధంగా రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు కృషి చేస్తున్న టాస్క్ ఫోన్ను ఎస్ఈబీకి అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు తెలిపారు. జనవరి 1వ తేదీ ఇంటింటికి రేషన్ ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర పాడి పరిశ్రమను పూర్తిగా బలోపేతం చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇలా దాదాపు అంశాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపింది.