అమరావతి: ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 9.30కి సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. రాజధానిపై హై పవర్ కమిటీ నివేదికకు ఆమోదం కేబినెట్ తెలపనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం కానుంది. హై పవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మూడు రాజధానుల అంశంపై కీలక ప్రకటన చేయనుంది.
ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు కమిటీ, బిసిజి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. ఈ రెండు కమిటీలను అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఏర్పాటైన హైపవర్ కమిటీ నివేదికను కూడా సమావేశాల్లో ప్రవేశ పెడతారు. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుంది.
గత అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున(డిసెంబర్ 17) మూడు రాజధానులు రావచ్చంటూ సిఎం జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ 28 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగనుండటంతో ప్రభుత్వం చేసే కీలక ప్రకటన కోసం రాజధాని రైతులతో పాటు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.