(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలకు సంబంధించి బిల్లులను ఆమోదించకుండా ఇబ్బంది పెడుతున్న శాసనమండలిపై వేటు వేయాలన్న కృత నిశ్చయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది.
సోమవారం మంత్రివర్గం సమవేశం కానున్నది. ఉదయం 9.30 గంటలకు జరిగే ఈ కేబినెట్ భేటీలో శాసనమండలిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఆర్డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలి ఆమోదించకుండా సెలెక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో సిఎం జగన్మోహనరెడ్డితో సహా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మండలి చర్యలను నిన్న శాసనసభలో తూర్పారబట్టిన విషయం తెలిసిందే. సలహాలు, సూచనలు ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుగా నిలుస్తున్న శాసనమండలి అనవసరం అన్న అభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే ఈ విషయంపై సిఎం జగన్ న్యాయనిపుణులతోనూ చర్చించినట్లు తెలుస్తోంది.
సోమవారం జరిగే శాసనసభలో శాసనమండలిని కొనసాగించాలా, వద్దా అనే అంశంపై సుదీర్ఘంగా చర్చిద్దామని జగన్ పేర్కొన్న నేపథ్యంలో అదే రోజు ఉదయం జరిగే కేబినెట్ భేటీలో శాసనమండలి రద్దుపై చర్చించి తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.