అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ ఎజెండా విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఏడు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతోంది. హైపవర్ కమిటీ నివేదిక, సిఫార్సులపై కేబినెట్ చర్చించిస్తున్నట్లు తెలుస్తోంది. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లుపై చర్చ జరగనున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో నాలుగు జోన్లు ఏర్పాటు నిర్ణయంపై కేబినెట్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లు.. అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. రాజధాని రైతుల అంశంపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. టేబుల్ ఐటమ్ గా టీడీపీ నేతలు చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణను లోకాయుక్తకు అప్పగించడానికి ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో పాటు రైతు భరోసా కేంద్రాలపై కేబినెట్ చర్చించనున్నట్టు సమాచారం. అలాగే ప్రతి గ్రామ సచివాలయంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది.