(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులు, మహిళలపై లాఠీ చార్జి చేసినందున పోలీసులకు సహాయ నిరాకరణ పాటించాలని రైతులు నిర్ణయించారు. ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 27వ రోజుకు చేరాయి. సోమవారం తుళ్లూరులో భారీ పోలీసు బలగాలతో పహారా నిర్వహించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. రైతులు ప్రైవేటు స్థలాల్లో షామియానా వేసుకొని దీక్షలను కొనసాగిస్తున్నారు.
కొన్ని గ్రామాల్లో పోలీసులకు నీళ్లు, టిఫికె, భోజనం అమ్మకాలను నిలిపివేశారు. పోలీసులకు ఎటువంటి విక్రయాలు చేయవద్దని దుకాణ యజమానులకు గ్రామస్తులు తెలిపారు. రైతులు, మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి లాఠీ చార్జీ చేసినందుకు నిరసనగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మందడంలో రోడ్డుపై ఎవరినీ పోలీసులు తిరగనివ్వడం లేదు. గ్రామస్తులు కూర్చునే పంచాయతీ బల్లలపై పోలీసులు కూర్చుంటున్నారు. దీంతో పోలీసులు కూర్చోకుండా బల్లలపై యువకులు ఆయిల్ పూశారు.