(ఫైల్ ఫోటో)
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో ఐదు రోజుల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో ఎన్డియేతర కూటమి బలోపేతమే లక్ష్యంగా దేశ రాజధానిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరితో సమావేశమై వివిధ అంశాలతో చర్చించిన చంద్రబాబు నేటి ఉదయం సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, డి రాజాలో ఎపి భవనంలో చర్చించారు. అనంతరం ఎపి భవన్ నుండి రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమైయ్యారు.
ఈ నెల 19న తుదివిడత పోలింగ్ ముగియనుండటంతో ఎన్డిఎకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. యుపిఎకి ఎన్ని సీట్లు వస్తాయి. మే 23 తరువాత అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణలపై చర్చించినట్లు సమాచారం.
నేటి మధ్యాహ్నం శరద్ పవర్, శరద్ యాదవ్లతో సమావేశమై సాయంత్రం లక్కో వెళ్లి బిఎస్పి అధినేత్రి మాయావతితో చంద్రబాబు భేటీ కానున్నట్లు సమాచారం.
బిజెపికి మేజిక్ ఫిగర్ దక్కకుండా చేసి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబు విపక్ష నేతలకు వివరిస్తున్నట్లు తెలుస్తోంది.
మరో పక్క ఈ నెల 23న ఎన్నికల ఫలితాల రోజు యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ విపక్షాలతో భేటీకి పిలుపునిచ్చారు. తటస్టంగా ఉన్న ప్రాంతీయ పార్టీ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నాలను యుపిఎ ముమ్మరం చేసింది. ఎన్నికల ఫలితాల తరువాత యుపిఎకి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమైతే బీజూ జనతదళ్, వైసిపిలను యుపిఎ వైపుకు తీసుకొచ్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాధ్కు సోనియా గాంధీ అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమల్నాధ్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో, వైసిపిలోని ముఖ్య నేతకు ఫోన్ ద్వారా సంప్రదించినట్లు సమాచారం.
మరో పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తోనూ సంప్రదింపులు జరిపేందుకు మరో సీనియర్ కాంగ్రెస్ నేతకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.