అమరావతి: స్పందన కార్యక్రమం అమలు తీరుపై మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో వినతులు ఇస్తే సత్వరమే పరిష్కారం అవుతున్నాయన్న నమ్మకాన్ని కల్గించారని జగన్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్లు, ఎస్పి తదితర అధికారుల పనితీరును ప్రశంసించారు.
పోలీసు స్టేషన్లు, తహశీల్దార్ ఆఫీసులు, సబ్ రిజిస్టార్, మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి కనిపించకూడదని జగన్ ఆదేశించారు.
ఇసుక సరఫరాపై అధికారులు దృష్టి సారించాలని జగన్ సూచించారు. అదే విధంగా కరెంటు సరఫరాలో అంతరాయాలు రాకుండా చూడాలని అధికారులను జగన్ ఆదేశించారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం, డిజిపి గౌతం సవాంగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.