(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
హైదరాబాద్: అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ఏపీ సిఎం వైఎస్ జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయనతో పాటు.. ఏ2గా ఉన్న వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా కోర్టు మెట్లు ఎక్కారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, విజయసాయిరెడడి,ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, పారిశ్రామికవేత్త శ్యామ్ ప్రసాదరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ తదితరులు విచారణకు హజరయ్యారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ కేసు విచారణ జరుగుతోంది.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలనాపరమైన అంశాలతో బిజీగా ఉండటంతో కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు. ప్రతి శుక్రవారం వాయిదాకు ఆయన తరఫున లాయర్లు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ అనుమతి తీసుకుంటూ వచ్చారు. అయితే, వరుసగా జగన్ గైర్హజరు అవ్వడం వల్ల విచారణపై ప్రభావం చూపుతోందంటూ సిబిఐ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి సారి మినహాయింపు ఇవ్వడం సరికాదని విన్నవించిన్న విషయం తెలిసిందే.
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిబిఐ కోర్టుకు హజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కోర్టు హాలు వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.