అమరావతి: రాజధాని తరలింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల ఫార్ములాలో ఎటువంటి మార్పు లేదన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో సిఎం జగన్ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
‘అందరూ బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలి, గతంలో అన్యాయంగా తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుతాం, అన్నదమ్ముల్లా అన్ని ప్రాంతాలు ఉండేలా ఈ పదవిని అందరి అభివృద్ధికి వినియోగిస్తా, అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయం’ అని జగన్ వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలు సమానమేననీ, గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను సరిచేస్తామనీ జగన్ చెప్పడంతో ఇది రాజధాని అంశంపై క్లారిటీగా భావిస్తున్నారు.