అమరావతి:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన విదేశీ పర్యటన ముగించుకొని శనివారం ఉదయం తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలి సారి అమెరికాకు వెళ్లి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా పలువురు అధికారులు, పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ నెల 15న జగన్ కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ పలు ప్రాంతాల్లో నివాసం ఉన్న ఎన్ఆర్ఐలతో పాటు విదేశాంగ శాఖ అధికారులతోనూ సమావేశమయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్థన్ శింగ్లా వాషింగ్టన్ డీసిలో ఇచ్చిన విందులో పాల్గొన్నారు. వ్యాపార, వాణిజ్య వేత్తల సమావేశంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జగన్ పిలుపు నిచ్చారు.
రాష్ట్రంలో తాజా పరిణామాలపై తన క్యాంప్ కార్యాలయంలో నేడు మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు సమచారం. పోలవరం ప్రాజెక్టు పనుల రివర్స్ టెండరింగ్ విషయంలో హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు, వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు తదితర విషయాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.