(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: అసెంబ్లీలో టిడిపి ఉప నేత అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలు అన్నీ తప్పనీ, ఆయన చెప్పిన లెక్కలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తారా అని సిఎం జగన్ సవాల్ విసిరారు. మద్యం పాలసీపై చర్చ సందర్భంలో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మద్యం షాపులను తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట తప్పిందనీ, అంతే కాకుండా రాష్ట్రంలో నాటు సారా అమ్మకాలు ఎక్కువయ్యాయనీ అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వం చెబుతున్నదానికి విరుద్ధంగా రాష్ట్రంలో మద్యం షాపుల సంఖ్య పెరిగిందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై సిఎం జగన్ తీవ్రంగా స్పందించారు. మద్యం అమ్మకాలపై చట్టసభలో టిడిపి అబద్దాల మీద అబద్దాలు చెబుతోందని అన్నారు.
టిడిపి హయాంలో ప్రభుత్వమే దగ్గరుండి మద్యం అమ్మకాలను ప్రోత్సహించిందని జగన్ పేర్కొన్నారు. టిడిపి నేతలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ అన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని అన్నారు. చంద్రబాబు హయాంలో 4380 మద్యం షాపులు ఉండగా తాము అధికారంలోకి వచ్చాక 20 శాతం షాపులను తగ్గించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3456 మద్యం షాపులు ఉన్నాయని జగన్ వివరించారు. మద్యం బెల్ట్ షాపులను పూర్తిగా నిరోధించామన్నారు. నవంబర్ నాటికి రాష్ట్రంలో మద్యం వినియోగం 23.63 శాతానికి తగ్గిందని సిఎం చెప్పారు. చంద్రబాబు హయాంలో గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగాయనీ, ఒక్క గ్రామంలో పది బెల్ట్ షాపులు నడిచాయనీ విమర్శించారు. గతంలో మద్యం షాపుల పక్కనే పర్మిట్ రూమ్లు పెట్టారని గుర్తు చేశారు. మహిళలు ఆ షాపుల దారిగుండా వెళ్లాలంటేనే భయపడేవారని సీఎం అన్నారు.మద్యం అమ్మకాలను తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్మకాలు జరుపుతున్నామని జగన్ చెప్పారు.