(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 40 నిముషాల పాటు భేటీ అయ్యారు. వీరి భేటీలో ప్రధానంగా మండలి రద్దు, దిశ బిల్లుకు చట్టబద్ధత, పెండింగ్ సమస్యలతో సహా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం కావాలని సీఎం జగన్ కోరినట్లు సమాచారం. కాగా రెండు రోజులు క్రితం ప్రధాని మోదీని కలిసిన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వివరించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి నిధులు కేటాయింపులోనూ చొరవ చూపించాలని ప్రధానిని కోరారు. ప్రధాని వద్ద చర్చించిన అంశాలను షా దృష్టికి తీసుకొని రావడంతో పాటు వినతి పత్రం అందజేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేటి రాత్రి ఢిల్లీలోనే బస చేసి శనివారం సంబంధిత శాఖల మంత్రులను కూడా సీఎం జగన్ కలువనున్నారు. రాష్ట్ర సమస్యలను వారి దృష్టికీ తీసుకెళ్లనున్నారు.