అమరావతి: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు జూలై ఒకటి నుండి సిఎం జగన్మోహనరెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే సిఎం క్యాంప్ కార్యాలయానికి ప్రతి రోజు పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, వివిధ రంగాలకు చెందిన వారు తరలివస్తూనే ఉన్నారు. వచ్చిన వారందరి నుండి నెల రోజులుగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వినతులు తీసుకుంటున్నారు. చాలా మంది ప్రజలు నేరుగా సిఎం జగన్ను కలిసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీంతో ప్రజల వినతులు తీసుకునేందుకు ప్రజదర్బార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
జగన్ ఆదేశాలతో ఇప్పటికే క్యాంప్ కార్యాలయం వద్ద అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యాంపు కార్యాలయం ప్రవేశమార్గం వద్ద ఒక వైపు షెడ్డును నిర్మించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి అక్కడ వేచి ఉండే అవకాశం కల్పిస్తారు. మంచినీటి సదుపాయం, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. రోజు ఉదయం ఎనిమిది గంటల తరువాత గంట పాటు జగన్ ప్రజల నుండి వినతులు స్వీకరించి నేరుగా వారి సమస్యలను తెలుసుకుంటారు. ఈ కార్యక్రమంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘స్పందన’ పేరుతో కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యలపై వినతి పత్రాల స్వీకరణకు ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఎల్లుండి సోమవారం నుండే ‘స్పందన’ కార్యక్రమం ద్వారా వినతులు స్వీకరించేందుకు కలెక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ను ప్రారంభించి కొనసాగించారు. ఆయన మార్గంలోనే తనయుడు జగన్ ప్రజాదర్బార్ పేరిట కార్యక్రమాన్ని అమలు చేస్తునున్నారు.