అమరావతి : రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలను అధికారులు క్రమంగా తప్పకుండా పరిశీలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలో కనీస వసతులు ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలన చేయాలని సిఎం సూచించారు. స్కూళ్లకు సంబంధించి తొమ్మిది రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించామనీ, మూడు దశల్లో ఈ సౌకర్యాలను కల్పిస్తున్నామనీ జగన్ చెప్పారు. అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్స్లో కూడా చేపట్టాల్సిన పనులపై ఒక ప్రణాళిక తయారు చేయాలని జగన్ ఆదేశించారు.
హాస్టళ్లలో వసతుల సౌకర్యం కోసం కలెక్టర్లకు నిధులు ఇచ్చారా? లేదా? అన్న విషయాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. 309 హాస్టళ్లలో కుక్స్, వాచ్మన్ సహా ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి తక్షణం చర్యలు తీసుకోవాలనీ, ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ జగన్ అధికారులను అదేశించారు.
నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ వనుల్లో కచ్చితంగా యాభై శాతం ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. వైఎస్ఆర్ చేయూత కింద లబ్దిదారులను గుర్తించే పని మొదలు పెట్టాలని జగన్ సూచించారు.
వచ్చే ఏడాది నుంచి 45 ఏళ్లు దాటిన ఎస్టి, ఎస్టి, బిసి, మైనార్టీ మహిళలకు ప్రతి ఏటా 18,750 రూపాయలను వైఎస్ఆర్ చేయూత పథకం కింద పంపిణీ చేయాలని జగన్ చెప్పారు.
రాజకీయాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. గిరిజన ప్రాంతాలైన సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ,
కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, అరుకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్.పురం, దోర్నాలలో సూపర్ స్పెషాల్టీ హాస్పటిల్స్ ఏర్పాటు చేయాలంటూ ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
గిరిజనులకు అటవీ భూములపై పట్టాలు ఇవ్వడంపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని జగన్ సూచించారు. ఎస్సి, ఎస్టిలకు వేరువేరుగా కమిషన్లను ఏర్పాటు చేస్తున్నామనీ, ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలనీ జగన్ ఆదేశించారు.