అమరావతి: గోదావరి నదిలో బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్రంగా స్పందించారు. తక్షణం ప్రమాదానికి సంబంధించి నివేదికను అందజేయాలని ఆదేశించారు. లాంచీ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తూ అన్ని బోటు సర్వీస్లను సస్పెండ్ చేయాలని సిఎం ఆదేశించారు. ప్రయాణానికి బోట్లు అనుకూలమా కాదా తదితర విషయాలను పరిశీలించాలనీ, నిపుణులతో మార్గదర్శకాలు రూపొందించి పూర్తి స్థాయి నివేదికను అందజేయాలనీ సిఎం అధికారులను సూచించారు. ప్రమాద ఘటనపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలనీ, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలనీ జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియాను సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటించారు.
కాగా బోటు ప్రమాద ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ జనసైనికులు సహాయక చర్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.