(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చారు.అమెరికా పర్యటనలో ఉన్న సిఎం జగన్ డల్లాస్ వేదికపై ప్రవాసాంధ్రులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసిపి చారిత్రాత్మక విజయం వెనుక ప్రవాంసాంధ్రుల కృషి ఎంతో ఉందని జగన్ కొనియాడారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి తోడ్పాటు అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అమెరికన్లను మించి తెలుగు వారు, భారతీయులు ఎదుగుతున్న తీరు గర్వకారణమని జగన్ అన్నారు. అమెరికా అభివృద్ధిలో తెలుగువారి కృషి ఉందనీ, ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడే చెప్పారని జగన్ గుర్తు చేశారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచేలా రెండున్నర నెలల పాలనలో విప్లవాత్మకమైన చర్యలు తీసుకువచ్చామని జగన్ అన్నారు. అవినీతి, లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించాలన్నదే తన కల అని జగన్ పేర్కొంటూ అందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలకు తావులేకుండా వివక్ష లేని పరిపాలన అందించడమే తన లక్ష్యమని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు అన్నీ కూడా లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి అందుబాటులోకి రావాలన్నదే తన కోరిక అని జగన్ చెప్పుకొచ్చారు.
రెండున్నర నెలల పరిపాలనలోనే అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లులను తీసుకువచ్చామనీ, గ్రామ వాలంటీర్లను, గ్రామ సెక్రటేరియట్లను తీసుకువచ్చామని జగన్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తున్నామనీ, పరిశ్రమలు, సంస్థల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా నిబంధన తీసుకువచ్చామని జగన్ వివరించారు.