గుంటూరు: రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుంటే జీర్ణించుకోలేక తన మతం గురించి, కులం గురించి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు మెడికల్ కళాశాల జింఖానా ఆడిటోరియంలో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని సోమవారం సిఎం ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ ‘నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకునే కులం’ అని పేర్కొన్నారు.
మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తున్నాననీ, ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటున్నాననీ జగన్ అన్నారు. తనకు సంబంధం లేని అంశాలను పెద్దవిగా చేసి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల, మతాల ప్రస్థావన తీసుకురావడం బాధకల్గిస్తుందన్నారు. ప్రతిపక్షాల అవాకులు, చెవాకులు పక్కన పెట్టి పాలనలో ముందుకు సాగుతానని జగన్ పేర్కొన్నారు. ఎన్నికుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతానని జగన్ అన్నారు. దేవుడి దయ, ప్రజల దీవేనలు తనకు ఉన్నాయన్నారు.