అమరావతి : అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అన్నారు. నేడు విజయవాడలోని గేట్వే హోటల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజధాని అంశం పై అయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే నం.1 నగరమని, విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయినీ జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం మన పిల్లలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లే అవసరం ఉండకూడదన్నారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు అమరావతి రాజధాని ప్రకటన ముందే భూములు కొనుగోలు చేసారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో అయిదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి 1.09,000 కోట్ల రూపాయలు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్పాయిన్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుంది.అమరావతిలోనూ అభివృద్ధి కొనసాగుతుంది’ అని జగన్ చెప్పారు.
అమరావతిపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.’ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ ఉంటుంది. అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం, హెడ్వోడీ, సచివాలయం’ ఉంటాయి అని చెప్పారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. రాజధాని గురించి ‘బాహుబలి’ లాంటి గ్రాఫిక్స్ చూపాలని తాను అనుకోవట్లేదని జగన్ అన్నారు.