అమరావతి: మీడియాపై కొరఢా జులిపించే విదంగా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం జర్నలిస్ట్ సంఘాలకు మింగుడు పడటం లేదు. మీడియాను అదుపులో పెట్టేందుకు గతంలో వై ఎస్ రాజశేఖరరెడ్డి జివో 938 తెచ్చారు. ఆ జివో ప్రకారం తప్పుడు కధనాలు రాస్తే సమాచార శాఖ స్పందించి చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఈ జివో ను వ్యతిరేకిస్తూ నాడు జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేసాయి. దీనితో ఆ జివో ను ప్రభుత్వం పక్కన పెట్టింది. అయితే నేడు జగన్ ప్రభుత్వం ఆ జివోను బయటకు తీసింది. ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబార్చేలా పత్రికలు, టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా వ్యతిరేక, అవాస్తవ, నిరాధార కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
తప్పుడు కథనాలు రాసిన, ప్రసారం చేసిన మీడియా సంస్థలపై న్యాయపరంగా చర్యలు చేపట్టేందుకు, ప్రాసిక్యూషన్కి వెళ్లేందుకు సంబంధిత ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకు అధికారం కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ చర్యలను సమీక్ష చేయడం, పాలనలో లోపాలు ఎత్తి చూపడం, అవినీతి అక్రమాలు బయట పెట్టడం మీడియా బాధ్యత. తప్పుడు వార్తలు రాసిన ప్రసారం చేసినా కోర్టు లను ఆశ్రయించే హక్కు ప్రభుత్వానికి గానీ ప్రజలకు ఉంటుంది.దీనిపై ప్రతేకంగా జి వో లు, క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఐజేయూ జాతీయ నాయకుడు శ్రీనివాస రెడ్డి అంటున్నారు. స్వీయ నియంత్రణ లేక పోవడం వల్ల ప్రసార మాధ్యమాల్లో తప్పుడు కధనాలు వస్తూనే ఉన్నాయ్. ప్రభుత్వం తప్పులు చేస్తుంది అలానే కొన్ని పత్రికలు తప్పులు చేసే అవకాశం ఉంది వాటిని సరిదిద్దుకోవాలి కానీ ఈ విధమైన నిర్ణయాలు మంచిది కాదని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు.
జర్నలిస్ట్ సంఘాల వత్తిడికి నాడు సియం రోశయ్య ఆ జివో పక్కన పెట్టగా నేడు ఆ పరిస్థితి ఉండదని అనుకుంటున్నారు. దీనిపై జర్నలిస్ట్ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.