అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ ఎంపీ ఇటీవలే స్పష్టం చేయడం తో పాటు పార్లమెంట్ లో కూడా కేంద్ర మంత్రి ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేసిన తరుణంలో సీఎం లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా.. ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని జగన్ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం తెలంగాణకు వెళ్లిందనీ, ఏపీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందనీ వెల్లడించారు.
ప్రధాని చొరవ తీసుకొని రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని జగన్ కోరారు.కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉన్నదని కితాబు ఇస్తూనే ఏపికి తగిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని వివరించారు. హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నివేదికల మధ్య తేడా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే విషయాన్ని తమరి దృష్టికి తీసుకొచ్చానని ప్రధానికి రాసిన లేఖలో జగన్ ప్రస్తావించారు.