AP CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ల బెయిల్ రద్దు పిటిషన్ పై నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ తొలుత జగన్, ఆ తరువాత విజయసాయిరెడ్డి ల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి అవ్వడంతో తీర్పును రిజర్వు చేసింది. ఈ నెల 15వ తేదీ (బుధవారం) తీర్పు వెల్లడిస్తామని సీబీఐ కోర్టు తెలియజేసింది. అయితే సీబీఐ కోర్టు తీర్పు రాకముందే తనకు వ్యతిరేకంగా తీర్పు రాబోతుందని గ్రహించిన రఘురామ కృష్ణంరాజు ఒక రోజు ముందు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా నిలుపుదల చేసి, న్యాయస్థానాన్ని మార్చాలని అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నేడు రఘురామ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో సీబీఐ కోర్టు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మస్ చేసింది. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషనర్ వాదనను సీబీఐ కోర్టు తిరస్కరించింది.
Read More: CBI Court: రఘురామకు సీబీఐ కోర్టులో బిగ్ షాక్..! జగన్, విజయసాయిలకు రిలీఫ్ ..!!
అయితే రఘురామ హైకోర్టును ఆశ్రయించడం వెనుక సీబీఐ కోర్టును అలర్ట్ చేయడం కోసం అంటే ఈ విషయాన్ని తాను ఇంతటితో వదలను పై కోర్టుకు వరకూ వెళతాను అని ఒక హింట్ ఇవ్వడం కోసమై ఉంటుందని భావించాల్సి ఉంటుంది. అసలు వాస్తవాలను పరిశీలిస్తే జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు లేవు. అందుకు కీలకమైన పాయింట్లు ఉన్నాయి. దానికి సీబీఐ కారణం. జగన్మోహనరెడ్డి సీబీఐ దాఖలు చేసిన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. దాదాపు 11 చార్జి షీట్లు సీబీఐ దాఖలు చేసింది. 16 నెలల పాటు జైలులో కూడా ఉండి వచ్చారు. అయితే గమనించాల్సింది ఏమిటంటే ఒక వేళ జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐనే స్వయంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి. పట్టుబట్టాలి. కానీ అటువంటిది జరగలేదు. వేరే ఎవరైనా ఈ కేసులో పిటిషన్ వేస్తే వారి పిటిషన్ కు బలం చేకూరేలా సీబీఐ అఫిడవిట్ దాఖలు చేయాలి. కానీ ఇక్కడ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ చాలా లైట్ గా తీసుకుంది. ఈ పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు వినిపించడానికి గానీ అఫిడవిట్ దాఖలు చేయడానికి గానీ సీబీఐ సుముఖత వ్యక్తం చేయలేదు. తొలుత సీబీఐ అఫిడవిట్ దాఖలు చేయడానికి మూడు నాలుగు వాయిదాలు కోరింది. కానీ చివరాఖరుకు తాము కోర్టు విచక్షణకే వదిలివేస్తున్నామనీ, తమ వాదనలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయము అని తేల్చి చెప్పింది. దీంతో రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ కు బలం చేకూరకుండా అయిపోయింది.
రఘురామ కృష్ణంరాజు తన పిటిషన్ లో జగన్మోహనరెడ్డి బెయిల్ షరతులు ఉల్లంగిస్తున్నారని అందుకే బెయిల్ రద్దు చేయాలని కోరారు. బెయిల్ షరతుల ప్రకారం ప్రతి శుక్రవారం వాయిదాలకు హజరు కావాలి, దర్యాప్తునకు సహకరించాలి. విదేశాలకు కోర్టు అనుమతి లేకుండా వెల్లకూడదు. సాక్షులను ప్రభావితం చేయకూడదు. వీటిలో కొన్నింటిని జగన్మోహనరెడ్డి ఉల్లంఘిస్తున్నారు. దానికి కారణం ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల కోర్టు వాయిదాలకు మినహాయింపు తీసుకుంటున్నారు. వాయిదాలకు హజరుకావడం లేదు. అయితే ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే సీబీఐ ఈ కేసులో తొలి నుండి గోడమీద పిల్లిగా వ్యవహరిస్తూ వచ్చింది. ఏ కోర్టుకు వెళ్లినా సీబీఐ తన వాదనలు వినిపించకుండా బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉందనీ గానీ లేక పోతే బెయిల్ షరతులు ఉల్లంఘించడం లేదు, కావున బెయల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని గానీ ఏదో ఒకటి చెబితే దాన్ని బట్టి తీర్పులు వస్తాయి కానీ అసలు కేసు నమోదు చేసిన సీబీఐనే మిన్నకుండిపోతే థర్డ్ పార్టీ వేసిన పిటిషన్ లకు ఏమి బలం ఉంటుంది. ఈ విషయంలో సీబీఐ ఎందుకు దొంగాట ఆడుతుంది అంటే అందుకు రాజకీయ కారణాలుగా పేర్కొనవచ్చు. నాడు జగన్మోహనరెడ్డిపై రాజకీయ కారణాలతోనే సీబీఐ కేసు నమోదు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు జగన్మోహనరెడ్డి పవర్ లో ఉన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలోని పెద్దల సహకారం కూడా ఉంది. కేంద్రం సహకారం ఉన్నంత కాలం జగన్మోహనరెడ్డి సేఫ్ జోన్ లో ఉన్నట్లే లెక్క. ఇటువంటి పిటిషన్ లు ఏ కోర్టుకు వెళ్లినా సీబీఐ సహకారం లభించదు. తద్వారా జగన్మోహనరెడ్డికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు.