అమరావతి: గత ప్రభుత్వ హయాంలో వివిధ ప్రాజెక్టుల టెండర్లలో భారీగా అవకతవకలు జరిగాయని భావిస్తున్న జగన్మోహనరెడ్డి సర్కార్ వాటిపై పూర్తి స్థాయి పరిశీలనకు నడుంబిగించింది. ప్రాజెక్టుల పునః సమీక్ష కోసం ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పునః సమీక్ష కోసం ఇప్పటికే వైసిపి ప్రభుత్వం ఇంజనీరింగ్ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తాజాగా ఆయా ప్రాజెక్టుల అంచనాలు, పనులు, పురోగతి తదితర అంశాలపై ఇంజనీరింగ్ నిపుణులతో జగన్ సమీక్షించారు. టెండర్లలో లోపాలు బయటపడితే రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. టెండర్ల విధానాన్ని అత్యంత పాదర్శకంగా రూపొందించాలని జగన్ సూచించారు. చెడిపోయిన వ్యవస్థను బాగుచేసుకోవడానికి తాను తపిస్తున్నానని జగన్ పేర్కొన్నారు. చూసి చూడనట్లు వెల్లండనీ తన పైనా ఒత్తిడి తెచ్చారనీ, అలా చేయదలుచులేదు కాబట్టే అవినీతిపై పోరాటానికి సిద్ధం అయ్యానని జగన్ అన్నారు. 100 రూపాయల పని 80 రూపాయలకే పని జరుగుతుందంటే రివర్స్ టెండరింగ్కు వెళతామని జగన్ అన్నారు.
రివర్స్ టెండరింగ్ ఎక్కడ చేయగలమో గుర్తించాలని అధికారులకు జగన్ సూచించారు. అవినీతి జరగకుండా ఉండేందుకే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును కోరమని జగన్ చెప్పారు. పోలవరం పనుల్లో అక్రమాలను నిగ్గు తేల్చాలని నిపుణుల కమిటీకి జగన్ ఆదేశించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉంది, అవినీతి వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యిందని జగన్ పేర్కొన్నారు. పోలవరంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్కు ఎక్కడ అవకాశం ఉందో గుర్తించాలని జగన్ అన్నారు.
పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గందరగోళం చేసిందనీ, స్పిల్వే పూర్తిచేయకుండా కాఫర్ డ్యాంకు వెళ్లారనీ, దాన్ని కూడా పూర్తిచేయకుండా వదిలేశారని దీంతో గోదావరిలో వెడల్పు తగ్గిందని జగన్ పేర్కొన్నారు. ఇప్పడు భారీగా వరద వస్తే నాలుగు నెలలపాటు పనులు చేపట్టలేని పరిస్థితి ఉందని జగన్ అన్నారు. పోలవరం తనకు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా జగన్ పేర్కొన్నారు.