అమరావతి: ఉద్యోగ విప్లవం ఇప్పటితో ఆగిపోదనీ, ప్రతి ఏటా జనవరి నెల ఉద్యోగాల భర్తీ నెలగా నిర్ణయిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షల్లో అర్హులై ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు విజయవాడ ఎ ప్లస్ కన్వెషన్ సెంటర్లో నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఉద్యోగాలు పొందిన వారందరికీ జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగాలు రాని వారు ఎవ్వరూ బాధపడవద్దనీ, ప్రతి ఏటా జనవరి మాసంలో ప్రభుత్వంలోని అన్ని ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామనీ చెప్పారు.
దేశ చరిత్రలో తక్కువ సమయంలో అత్యంత పారదర్శకంగా అర్హత పరీక్షలు నిర్వహించామని జగన్ అన్నారు. 20 లక్షల మందికిపైగా అభ్యర్థులకు ఎనిమిది రోజులు పరీక్షలు నిర్వహించి లక్షా 40వేల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించడం గొప్ప రికార్డు అని జగన్ సగర్వంగా వెల్లడించారు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రికార్డు ఇది అని జగన్ పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు తిరక్కముందే నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగామని జగన్ చెప్పారు.
సేవ చేయడం కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రతి గ్రామ సచివాలయ ఉద్యోగి గుర్తు ఉంచుకోవాలని జగన్ అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు ప్రభుత్వానికి రెండు కళ్లుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి పనికి లంచం ఇవ్వనిదే జరగని పరిస్థితి చూశామనీ, ఈ పరిస్థితులు రూపుమాపేందుకే వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నామనీ జగన్ స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో పారదర్శక పాలన కోసం ప్రజలు తనకు నేరుగా ఫిర్యాదులు చేసేందుకు 1902 కాల్ సెంటర్ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని జగన్ చెప్పారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎటువంటి ఆరోపణలు లేకుండా సమర్థవంతంగా అర్హత పరీక్షలు నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, సహకరించిన ఎస్పిలు, ఇతర అధికారులు అందరికి జగన్మోహనరెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని తదితరులు హజరయ్యారు.