అమరావతి:ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన మద్ర వేసుకునే క్రమంలో భాగంగా రేషన్ వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. అవినీతి తావులేని విధంగా పథకాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకు వస్తున్నారు.
అమరావతి వేదికగా సాగుతోన్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కీలక నిర్ణయాలను ప్రకటించారు.
ప్రభుత్వం అందజేసే రేషన్ సరుకులను నేరుగా లబ్దిదారులకు గ్రామ వలంటీర్లే అందజేయనున్నారని సీఎం ప్రకటించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇకపై రేషన్ డీలర్లు ఉండబోరని జగన్ వెల్లడించారు.
వాలంటీర్లే సరకులను ఇంటింటికీ పంపిణీ చేస్తారనే అంశంపై చర్చ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రస్తావన వచ్చిన సమయంలో సీఎం పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది.
తెల్ల రేషన్ కార్డుదారులకు సెప్టెంబరు ఒకటి నుంచి సన్న బియ్యాన్నే పంపిణీ చేయాలని అధికారులకు జగన్ ఆదేశించారు.
దీనికోసం పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదనలు, కలెక్టర్ల నుంచి తీసుకునే సహకారం తదితర అంశాలపై ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలియజేశారు. ప్యాకింగ్ యూనిట్ల ఏర్పాటు, గొడౌన్లు సంబంధిత వివరాలను పౌరసరఫరాల సంస్థ ఎండి సూర్యకుమారి వివరించారు.
తినగలిగే బియ్యాన్ని, అదీ ప్యాకింగ్ రూపంలో ఇచ్చే ప్రక్రియ రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు.
ప్యాకింగ్ యూనిట్లు, నిల్వ కేంద్రాల ఏర్పాటు కొలిక్కి వచ్చిన జిల్లాల్లో తొలి విడతలో, మిగితా చోట్ల రెండో విడతలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉన్న బియ్యంలోనే నాణ్యమైన రకాన్ని వేరుచేసి, తొలి విడత జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు.
తర్వాత నుంచి ధాన్యం సేకరణ సమయంలోనే కొన్ని రకాలను వేరుచేసి వీటిని సేకరించనున్నారు.
జిల్లాల్లో ఇప్పటికే ఆటోమేటిక్ ప్యాకింగ్ యూనిట్లు అందుబాటులో ఉంటే వారికి పని అప్పగించేలా ఏర్పాట్లు చేయాలని, అదనంగా నిల్వ కేంద్రాలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
వాలంటీర్ల ధ్రువీకరణ కోసం పంచాయతీరాజ్, పాఠశాల విద్యాశాఖలో అమలుచేస్తున్న విధానాలను పరిశీలించి అమలు చేయాలనీ, తినగలిగే రకం ధాన్యాన్ని పండించే దిశగా రైతుల్ని ప్రోత్సహించాలని సిఎం తెలిపారు.
ఖరీఫ్లో 1.31లక్షల హెక్టార్లు, రబీలో 3.15లక్షల హెక్టార్లలో ఇలాంటి రకం ధాన్యాన్ని పండించేలా రైతుల్లో మార్పు తీసుకురావాలన్నారు. పంట చేతికొచ్చే సమయంలో సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, అపుడే మంచి రకాన్ని వేరు చేయాలని సూచించారు.
నిల్వ కేంద్రాల నుంచి వలంటీర్లు రేషన్ సరుకులను బయోమెట్రిక్ ధ్రువీకరణతో తీసుకుంటారు.లబ్ధిదారుల ఇంటికి తీసుకువెళ్లి వారితోనూ బయోమెట్రిక్ పరికరంపై ధ్రువీకరణ తీసుకున్నాకే సరకుల్ని అందజేస్తారు. లబ్ధిదారుడి వేలిముద్ర సరిగా పడకపోతే వారి ఆధార్ నెంబరు ఆధారంగా సరకులను ఇవ్వనున్నారు. ఆయితే రేషన్ డీలర్ ల వ్యవస్థను నూతన సిఎం రద్దు చేయనుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న సుమారు 30వేల మంది రేషన్ డీలర్లలో ఆందోళన నెలకొన్నది.
ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించాలని రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం కోరుతోంది. తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాలలో శాంతియుతంగా మౌన ప్రదర్శనలు నిర్వహించేందుకు సంఘ నేతలు పిలుపు నిచ్చారు.