అమరావతి: ప్రజా సంక్షేమం కోసం మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షాల నాయకులు ఆడిపోసుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని సిఎం జగన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ ఆరు నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నా అపనిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ చెడూ చేయకపోయనా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
వెనకబడ్డ తరగతులు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్గా మార్చాలని తాపత్రయపడుతున్నానని అన్నారు. ఎస్సి, ఎస్టిలు, మైనార్టీలు అంటే వెనకబడ్డ వారు కాదనీ, వాళ్లని ముందడుగులోకి తీసుకెళ్లాలని ఆరాటపడుతున్నానని తెలిపారు. అలా ఆరాటపడటమే తను చేసిన తప్పు అన్నట్టుగా ఈ రోజు దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు.ఇలా తప్పుగా మాట్లాడుతున్న నాయకులను, తప్పుగా మాట్లాడుతున్న మీడియాను ప్రజలు ప్రశ్నించాలని జగన్ సూచించారు. అయ్యా! మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? మీ మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు అంటూ గట్టిగా నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు.మీకేమో ఇంగ్లిషు మీడియం, మా పిల్లలకేమో తెలుగు మీడియం అనడం భావ్యమేనా అని అడగాలని సూచించారు.ఎంత మంది శత్రువులు ఏకమైనా, ఎన్ని అపనిందలు వేసినా తట్టుకుని నిలబడతా అని జగన్ స్పష్టం చేశారు.