విజయవాడ: రాష్ట్రంలో వేళ్లూరుకున్న అవినీతి, దళారీ వ్యవస్థను రూపుమాపి సుపరిపాలన అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. స్వాత్యంత్ర్య దినోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా వైఎస్ జగన్మోహనరెడ్డి జాతీయ జండా ఆవిష్కరించిన అనంతరం తన సందేశంలో తమ ప్రభుత్వ హయాంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏకరువు పెడుతూనే రాజకీయంగా ప్రతిపక్షంపైనా విమర్శలు గుప్పించారు.
అధికారం, అవినీతి పాలునీళ్లులా కలిసి పోయాయనీ, ఇలాంటి వ్యవస్థను మార్చాలా వద్దా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు. పేదలకు, రైతులకు తక్కువ ధరకు కరెంటు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా విద్యుత్ పిపిఎలపై పునః సమీక్ష చేస్తుంటే నానా యాగీ చేస్తున్నారని జగన్ విమర్శించారు. అదే విధంగా కాంట్రాక్ట్ పనుల్లో అవినీతి, అక్రమాలను నిరోధించి దుబారా వ్యయం తగ్గించేందుకు రివర్స్ టెండరింగ్కు వెళుతున్నా, ప్రైవేటు కర్మాగారాలు, సంస్థల్లో 75శాతం స్థానిక రిజర్వేషన్ చట్టాన్ని తీసుకువచ్చినా ప్రతిపక్షాలు అర్థంలేని విమర్శలు చేస్తున్నాయని జగన్ దుయ్యబట్టారు.
రాష్ట్ర విభజన వల్ల కలిగిన నష్టాలను పూడ్చుకునేందుకు నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు అడుగులు వేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. సంస్కరణలు తీసుకువచ్చిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని జగన్ అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కోటి రూపాయలు దాటిన కొనుగోళ్లన్నింటిలో పారదర్శకత పెంచేలా ఆన్లైన్లో పెడతామనీ, కొనుగోలు చేయాల్సిన వస్తువుల నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించి మునుపటి రేట్ల కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికి ఆ అవకాశం ఇస్తామని జగన్ చెప్పారు. విద్యా నైపుణ్యాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ల్యాండ్ మాఫియా, అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ రికార్డులకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం తమదని జగన్ అన్నారు.
అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శక పాలన అందిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పధంలో తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని జగన్ వెల్లడించారు.