(న్యూ ఆర్బిట్ బ్యూరో)
గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాడుతూ మహిళలు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి తాడేపల్లి ప్రాంతంలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు మహిళలు పేకాడుతూ పట్టుబడ్డారు. పోలీసులు దీనిని నేరంగా మాత్రమే చూస్తూ కేసులు పెట్టి చేతులు దులుపుకోవడంతో పరిస్థితులు మారడం లేదు.
తాడేపల్లి ప్రాంతంలో ఒక షెడ్యూలు తెగకు చెందిన వారు కొందరు ఉన్నారు. కొన్ని తరాలుగా వారు నేరాలకు పాల్పడుతూ వస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ, కొన్ని సందర్భాలలో ఇతర రాష్ట్రాలకూ వెళ్లి నేరాలు చేసి సొత్తుతో వెనక్కివస్తారు. వారి జీవనవిధానం వారిని పేకాట వైపు కూడా నడిపించింది. తాడేపల్లి పోలీసులకు ఈ వ్యవహారంలో తెలియనిదేమీ లేదు.
గతంలో తాడేపల్లి పోలీసు స్టేషన్లో పని చేసిన కొందరు అధికారులు ఈ తెగ ప్రజలపై దృష్టి సారించారు. వారిని నేరాల బాట నుండి తప్పించేందుకు ప్రయత్నించారు. ఫలితంగా చాలామంది ఆ దారి వదిలి కొత్త జీవితం ప్రారంభించారు. అందరిలాగా తమ పిల్లలను కూడా చదివించుకోవాలన్న ఒక్క ఆలోచనే చాలామందిలో మార్పు తీసుకువచ్చింది.
నేరాలను అరికట్టడానికి నేరస్థులను శిక్షించడమొక్కటే దారి అన్న పోలీసుల వైఖరి ఈ సమస్య మూలాలను గుర్తించడం లేదు. ఫలితంగా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఎప్పుడన్నా ఆలోచించే పోలీసు అధికారుల వల్ల కొంత మార్పు వస్తున్నప్పటికీ అలాంటి అధికారుల బదిలీ తర్వాత దానిని ముందుకు తీసుకువెళ్లే వారు లేక సమస్య మళ్లీ మొదటికి వస్తున్నది.