అమరావతి:రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాపై బదిలీ వేటు వేసింది. నూతన చీఫ్ సెక్రటరీగా 1982 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఎల్ వి సుబ్రహ్మణ్యం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పునేఠాకు ఎన్నికలతో సంబంధం లేని పోస్టులో నియమించాలని ఆదేశించింది.
రాష్ట్రంలో ముగ్గురు ఐపిఎస్ ల బదిలీల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠాను ఢిల్లీకి పిలిపించి వివరణ తీసుకున్నట్లు సమాచారం. ఐపిఎస్ ల విషయంలో వెంట వెంటనే మూడు జివోలు విడుదల చేయడంపై నినరణ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల విధులకు సంబంధం లేని ఇంటెలిజెన్స్ డిజి ఎబి వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం, ఈ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం తదితర విషయాలు విదితమే.
ఈ నేపధ్యంలో స్ధానికంగా ఉన్న ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠాపై బదలీ వేటు వేసినట్లు సమాచారం.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. విశాఖ ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఎందుకు బదిలీ చేశారో కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.