(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై వివాదం ఇంకా కొనసాగుతోంది. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్ కోసమే ఇంగ్లీష్ మీడియం బోధన తీసుకొచ్చామని జగన్ సర్కార్ చెబుతుండగా..ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మాతృభాషను లేకుండా చేయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పా శ్రీవాణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ రాకపోతే కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయడానికి తానే ఒక ఉదాహరణ అని చెప్పారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని బూసరాజుపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ‘మన బడి నాడు-నేడు’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇంగ్లీష్ రాకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తాను పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివానని.. ఇంటర్లో ఇంగ్లీషు మీడియంలో చేరానని శ్రీవాణి చెప్పారు. అయితే ముందు నుంచి ఇంగ్లీష్లో చదవకపోవడం వల్ల మూడు నెలలకే మళ్లీ తెలుగు మీడియంలో చేరి ఇంటర్ పూర్తి చేసినట్టు తెలిపారు. డిగ్రీలో మళ్లీ ఇంగ్లీష్ మీడియంలో చేరినప్పటికీ.. ఇంగ్లీష్ భాషపై అంతగా పట్టు సంపాదించలేకపోయానని చెప్పారు. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఇప్పటికీ ఎంతగానో ఎంతగానో బాధపడుతుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి విద్యార్థులకు అలాంటి ఇబ్బంది రాకూడదనే.. సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెడుతున్నారని శ్రీవాణి పేర్కొన్నారు.