అమరావతి, మే 2 : ఎన్నికల ఫలితాలపై అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైసిపిలు అత్యధిక స్థానాలు గెలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన పోటీ వైసిపి, టిడిపి మధ్యనే కొనసాగినప్పటికీ ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో జనసేన కాస్త గట్టి పోటీ ఇవ్వడంతో అక్కడ కొన్ని స్థానాలలో త్రిముఖ పోటీ జరిగిందని చెప్పవచ్చు.
అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారాన్ని కొనసాగుతామని అధికార టిడిపి చెబుతుండగా, చంద్రబాబు ఇంటికి వెళ్లడం ఖాయమని, వైసిపి అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ నేతలు ఢంక భజాయించి చెబుతున్నారు. పోలింగ్ సరళి చూసి ఓడిపోతున్నామనే భయంతోనే చంద్రబాబు ఇవిఎంలపై నెపం వేయడానికి తాపత్రయ పడుతున్నారని వైసిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి ఏకంగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలు పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటి నుండి వందకు పైగా స్థానాలు ఖాయమంటూ చెప్పుకొచ్చినా జనసేన మాత్రం ఇన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని స్పష్టంగా ప్రకటించలేదు.
అయితే రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం ఉందనీ, ఊహించని ఫలితాలు ఉంటాయని జనసేన వర్గాలు అంటున్నాయి.
తాజాగా బుధవారం గాజువాకలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో ఆ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరం తన ప్రసంగంలో ఐదు లోక్సభ స్థానాలు జనసేన పార్టీకి ఖాయమైపోయాయనీ, మిగిలిన లోక్సభ స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చామనీ అన్నారు. ప్రధానంగా విశాఖపట్నం, నరసాపురం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ లోక్సభ స్థానాలు జనసేన కైవసం చేసుకోవడం ఖాయంగా చెప్పుకొచ్చారు. ఈ స్థానాల్లో జనసేన తరపున గట్టి అభ్యర్థులే రంగంలో ఉన్నారు. విశాఖ నుండి జనసేన అభ్యర్థిగా మాజీ సిబిఐ జెడి వివి లక్ష్మీనారాయణ, నరసాపురం నుండి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, సినీ నటుడు కొణిదెల నాగబాబు, అమలాపురం నుండి మాజీ ఒఎన్జిసి అధికారి డిఎంఆర్ శేఖర్, రాజమండ్రి నుండి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ఆకుల సత్యనారాయణ, కాకినాడ నుండి సీనియర్ నేత జ్యోతుల వెంకటేశ్వరరావులు పోటీ చేశారు.
2009 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపింది. ఆనాటి ఎన్నికలలో పిఆర్పి అభ్యర్దులు ఏ మేరకు వోట్లు సంపాదించారో చూస్తే తాజా ఎన్నికలలో జనసేన ప్రభావం ఎలా ఉంటుందో కొంత ఊహించవచ్చు.
విశాఖ లోక్సభ స్థానానికి సంబంధించి 2009 ఎన్నికల్లో పిఆర్పి అభ్యర్థి మూడు లక్షలకు పైగా ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. నాడు 66వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
నరసాపురం విషయానికి వస్తే నాడు పిఆర్పి అభ్యర్థి టిడిపి అభ్యర్థితో సమానంగా 2,67,058ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలవగా 3,89.422ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజు విజయం సాధించారు.
అమలాపురం లోక్సభ స్థానంలో నాడు పిఆర్పి అభ్యర్థి మూడు లక్షల పైచిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలవగా కేవలం 40వేల ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి హర్షకుమార్ గెలుపొందారు.
రాజమండ్రి లోక్సభ స్థానంలో నాడు పిఆర్పి అభ్యర్థి 2,53,437ఓట్లు సాధించి మూడవ స్థానంలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్కుమార్ కేవలం 2,147ఓట్ల ఆధికత్యతో విజయం సాధించారు.
కాకినాడ లోక్సభ స్థానంలో పిఆర్పి అభ్యర్థి చలమలశెట్టి సునీల్ 2,89,563ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలవగా కేవలం 34వేల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి పల్లంరాజు గెలుపొందారు.
ఈ ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాకర్షణతోపాటు అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ తోడు కావడం వల్ల విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ఆ పార్టీ నేతలు చెప్పినట్లు వీరు విజయం సాధిస్తారా లేక గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారా అనేది తెలియాలంటే ఈ నెల 23వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.