అచ్చమైన అవినీతేనా…? అచ్చెమ్ ఏమిటిది…?
అసలే జగన్. చుట్టూ ఆయన రాజ్యం. తవ్వకం మొదలుపెడితే ఎంత లోతైన బయటకు రావాల్సిందే కదా…! అందుకే గత ప్రభుత్వ తతంగాలు ఒక్కోటీ బయటకు వస్తున్నాయి. రాజధాని అమరావతిలో భూమాయపై సీఐడీ విచారణ జరుగుతుండగా… తాజాగా ఈఎస్ఐలో ఒక బాగోతం వెలుగులోకి వచ్చింది. లేని కంపెనీల నుండి కొటేషన్లు తెప్పించుకుని.., వాస్తవ ధర కంటే 136 శాతం అధికంగా చెల్లించి మందుల సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టినట్టు, తద్వారా రూ. 100 కోట్లు వరకు అవినీతి జరిగినట్టు విజిలెన్స్ ఎన్ ఫోర్స్మెంట్ నివేదికలో వెల్లడయ్యింది. దీనిలో నాటి మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర స్పష్టంగా ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు.
నారాయణ…, పత్తిపాటి పుల్లారావు…, నారా లోకేష్…, దేవినేని ఉమామహేశ్వరరావు… తాజాగా అచ్చెన్నాయుడు…! వీరి చుట్టూ అవినీతి బాగోతాలు బయటపడుతున్నాయి. ఇవి ఆరోపణల వరకు పరిమితమయితే వారికి, వారి బాస్ చంద్రబాబుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే. కానీ లోతుగా విచారణ జరిగి వాస్తవమని తేలితే మాత్రం కొందరు జైలుకెళ్లడం ఖాయమే. ఇక అచ్చెన్నాయుడుపై వచ్చిన ఆరోపణలు, విజిలెన్స్ నివేదికపై కాస్త వివరంగా చెప్పుకోవాలంటే…
గత ఆరేళ్లుగా ఈఎస్ఐలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు.
కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఓ నివేదికను విడుదల చేసింది. నకిలీ కొటేషన్లు సృష్టించి రేట్ కాంట్రాక్టులో లేని సంస్థలనుంచి మందులు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వం రూ. 89 కోట్లు చెల్లిస్తే, అందులో రేట్ కాంట్రాక్ట్ లో ఉన్న సంస్థలకు 38 కోట్లు చెల్లించినట్టు గుర్తించారు. మిగతా రూ. 51 కోట్లను దారి మళ్లించి రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థలకు వాస్తవ ధర కంటే 136 శాతం అధనంగా అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి.
తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ముఖ్యపాత్ర పోషించిన సరఫరాదారులే ఈ స్కాంలో కూడా ఉన్నట్లు తేలింది. అప్పటి డైరెక్టర్లు రవి కుమార్, రమేష్ కుమార్, విజయ్ కుమార్ లోపాటు, ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్లు ముఖ్యపాత్ర పోషించారని అధికారులు వెల్లడించారు. వీరితో పాటు అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. తన వాళ్లకు చెందిన టెలీ హెల్త్ సర్వీసెస్ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించాలని ఈఎస్ఐ డైరెక్టర్లకు లేఖ రాసినట్లు తెలిసింది. మంత్రి చొరవతోనే సదరు డైరెక్టర్లు రూ. 975 కోట్ల మందుల కొనుగోలు చేసి, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించినట్లు ఆరోపణలున్నాయి.
అయితే మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వానికి చూపి ఖజానాకు 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించారు. (దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల)
ఈఎస్ఐ స్కాంకు పాల్పడిన లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్ని మెడీ, ఎన్వెంటర్ పర్ఫామెన్స్ సంస్థలకు సదరు డైరక్టర్లు లాబ్ కిట్ల కొనుగోలు పేరుతో 85 కోట్లు చెల్లించారు.
2018-19 సంవత్సరానికి 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంటే , అందులో కేవలం రూ. 8 కోట్లు మాత్రమే వాస్తవ ధరగా ప్రకటించి మిగతా నిధులు స్వాహా చేశారు. అంతేగాక మందుల కొనుగోలు, ల్యాబ్ కిట్లు ,ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలు లో భారీగా అక్రమాలు జరిగినట్టుగా కూడా గుర్తించారు. వాస్తవానికి ఒక్కో బయోమెట్రిక్ మిషన్ ధర రూ.16,000 అయితే ఏకంగా రూ. 70 వేల చొప్పున నకిలీ ఇండెంట్లు సృషించి అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో తేలింది.
ఇక ఈ వ్యవహారంపై లోతుగా ప్రభుత్వం విచారణ జరిపిస్తే ఎంతమంది పేర్లు బయటకు వస్తాయి, ఎవరు ఊచల్లోకి వెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది.