(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పాకిస్తాన్ చెరలో ఏడాదికిపైగా బందీలుగా ఉన్న ఉత్తరాంధ్ర జాలర్లకు విముక్తి లభించింది. జైల్లో ఉన్న 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేశారు. వారిని సోమవారం పంజాబ్ లోని వాఘా సరిహద్దు వద్ద అప్పగించనున్నారు. ఇరుదేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య జరిగిన సంప్రదింపుల్లో కుదిరిన అవగాహన మేరకు ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 మంది మత్స్యకారులను విడుదల చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే మత్స్యకారులందరినీ జైలు నుంచి విడుదల చేసిన పాక్.. ఇవాళ సాయంత్రం పంజాబ్లోని వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగించనుంది. ఉత్తరాంధ్ర జాలర్లను అప్పగించిన అనంతరం ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జాలర్లను రాష్ట్రానికి తీసుకొస్తారు. అందుకోసం ఆయన అధికారులతో కలిసి ఆదివారం వాఘా సరిహద్దుకు వెళ్లారు.
పాక్ విడుదల చేసిన తెలుగువారిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎస్.కిశోర్, నికరందాస్ ధనరాజ్, గరమత్తి, ఎం. రాంబాబు, ఎస్.అప్పారావు, జి.రామారావు, బాడి అప్పన్న, ఎం.గురువులు, నక్కా అప్పన్న, నక్క నర్సింగ్, వి.శామ్యూల్, వి.ఎర్రయ్య, డి.సురాయి నారాయణన్, కందా మణి, కోరాడ వెంకటేశ్, శేరాడ కళ్యాణ్, కేశం రాజు, భైరవుడు, సన్యాసిరావు, సుమంత్ ఉన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులు బతుకుదెరువు కోసం గుజరాత్ వలస వెళ్లారు. 2018 నవంబరులో అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 22 మంది జాలర్లను తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణలతో పాక్ కోస్టుగార్డులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి వారు అక్కడి జైలులో మగ్గుతున్నారు. అయితే ఆంధ్రకు చెందిన జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వంతోపాటు కోస్తాకు చెందిన ఎంపీలు విదేశాంగ శాఖను కోరారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు, విజయనగరం ఎంపీ చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. జాలర్లను విడుదల చేయించాలని లేఖలు రాసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో విదేశాంగశాఖ చొరవచూపి జాలర్ల విడుదలకు కృషి చేసింది.
పాకిస్తాన్తో చర్చలు జరిపి ఆంధ్రా జాలర్లను విడిచిపెట్టాలని కేంద్ర విదేశాంగ శాఖ కోరింది. దీంతో ఆంధ్ర జాలర్లను విడిచి పెట్టేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. 20 మంది మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్ ఓకే చెప్పింది. జనవరి 6న సోమవారం వాఘా సరిహద్దు వద్ద భారత్ అధికారులకు 20 మంది మత్స్యకారులను అప్పగిస్తామని పాకిస్తాన్ పేర్కొంది. చేపల వేటకెళ్లి పాక్ చెరలో చిక్కుకున్న తమ వారిని అక్కడి సైనికులు ఏం చేస్తారోనన్న భయంతో బాధిత కుటుంబాలు బతికాయి. జాలర్ల విడుదలకు పాక్ ప్రభుత్వం అంగీకరించడంతో బాధిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.