అమరావతి: గడచిన తెలుగుదేశం ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు స్వచ్చందంగా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలనీ, లేకుంటే వారిని తొలగించాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు రాజీనామా చేయాల్సిందేననీ, వారంతట వారు తప్పుకోకుంటే వెంటనే తొలగించాల్సిందిగా సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి శిసోడియా తాజాగా అదేశాలు జారీ చేశారు. గౌరవరంగా వారు పదవుల నుండి తొలగకుంటే వారిని తొలగిస్తూ సంబంధిత శాఖలు ఆదేశాలు జారీ చేయాలని శిసోడియా ఉత్తర్వులో పేర్కొన్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో నియమితులైన చాలా మంది చైర్పర్సన్లు, చైర్మన్లు, ఎక్స్పర్ట్లు, కన్సల్టెంట్లు ఇంకా పదవులకు రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టిసి చైర్మన్గా నియమితులైన వర్ల రామయ్యతో సహా పలువురు ఇంకా తమ పదవులకు రాజీనామా చేయలేదు.