అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ పేరిట ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల శాసనసభ ఏపీ ఆర్టీసీ చట్టం-2019ను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ద్వారా ఆర్టీసీ ఇకపై ప్రభుత్వ రంగ సంస్థగా అవతరించనుంది. ఉద్యోగుల విలీనానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేయనుంది. దీంతో ఈ చట్టం అమల్లోకి రానుంది. రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు దీనిపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీనంపై సభలో మాట్లాడిన సీఎం జగన్.. ఆర్టీసీలో పనిచేస్తున్న 52వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని ప్రకటించారు. జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనున్నట్టు వెల్లడించారు.
కాగా, ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ఎన్నికల వేళ ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. దీంతో ఇప్పటివరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ.. ఇక నుంచి పూర్తిస్థాయి ప్రభుత్వ సంస్థగా మారనుంది.