సుగాలి ప్రీతీ. ఈ పేరు విన్న వెంటనే మానవత్వం ఉన్నవారి కళ్ళు చెమర్చుతాయి. అమ్మ అన్నవారి గుండె లు బరువెక్కుతాయి. ఒక అమ్మ మనసు ముక్కలై రెండేళ్లు గడిచింది. ఇక మిగిలిన తనువుపోరాటానికి ఇచ్చేసింది ఆ అమ్మ. ఇప్పటికి ఆమె పోరాటానికి విజయపు అడుగు పడింది. సుగాలి ప్రీతీ అత్యాచారం, హత్య కేసుని సిబిఐ విచారణకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల కర్నూలులో పర్యటించిన సందర్భంగా సీఎం జగన్ ఆ తల్లికి ఇచ్చిన హామీ మేరకు…, ఈరోజు నెరవేర్చారు. ఇన్నాళ్లు దీని కోసం పోరాడిన ఆ తల్లి హృదయానికి కాస్త ఊరట లభించింది. ఇక నిందితులను పట్టుకుని, సరైన రీతిలో శిక్షిస్తే న్యాయంపై అటువంటి తల్లులకు భరోసా దక్కుతుంది.
తెర వెనుక ఎవరున్నారో…!
కర్నూలు నగర శివారులోని లక్ష్మీగార్డెన్లో ఉంటున్న ఎస్.రాజు నాయక్, ఎస్.పార్వతిదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి (14) ఒక రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం పెర్కొంది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్ట్లో సైతం అమ్మాయిని రేప్ చేసినట్లు నిర్ధారించారు. పెథాలజీ హెచ్ఓడీ డాక్టర్ జి.బాలేశ్వరి సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ 21 ఆగస్టు 2017న నివేదిక ఇచ్చారు. ప్రీతి తల్లిదండ్రులు తమ దగ్గరున్న ఆధారాలతో పోలీసు స్టేషన్లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యజమాని, కుమారులపై ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు ఫోక్సో సెక్షన్ 302, 201, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ హత్య సంఘటనపై విచారణకు ముందుగా త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్.. తర్వాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. విద్యార్థినిపై లైంగిక దాడి చేసి.. హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. అమ్మాయి శరీరంపై ఉన్న గాయాలను, అక్కడి దృశ్యాల పట్ల అనుమానం వ్యక్తం చేసింది.సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితులను అరెస్టు చేశారు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. దీంతో తమ బిడ్డను రేప్ చేసి చంపిన వారిని శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. ఆధారాలు పక్కాగా ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని బాధితురాలి తల్లి వాపోయింది. ఇదే విషయమై ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను సైతం కలిశారు. గత నెలలో పవన్ కర్నూలులో ర్యాలీ నిర్వహించారు.
దిశా కేసు అనంతరం మళ్ళీ పోరాటం…!
దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో.. “జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి” అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ.. ప్రీతి తల్లి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె పిలుపు మేరకు “జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి” అనే హ్యాష్ ట్యాగ్తో భారీ సంఖ్యలో ట్వీట్లు చేశారు. దిశకు న్యాయం చేసిన విధంగా.. తన బిడ్డకు న్యాయం చేయాలని ప్రీతి తల్లి కోరింది. ఈ మేరకు నాయకులను, అధికారులను కలిసి తమ వద్ద ఆన్న ఆధారాలను ఇచ్చింది. ఈ బాధిత తల్లికి న్యాయం చేసేలా, ఆ అభాగ్యురాలికి జరిగిన ఘోరాన్ని బయట పెట్టేందుకు ఈ కేసుని సిబిఐ కి అప్పగించడం శుభ పరిణామం. ఆ తల్లి విజయమని, విచారణ సజావుగా సాగి న్యాయం జరగాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. – శ్రీనివాస్ మానెం