(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టింది మొదలు సంక్షేమ రంగంపైనే అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారనేది అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్న పథకాల అమలుపైనే సిఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంచనా వేయకుండా ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన హామీల అమలుకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి కరోనా పరిస్థితులు మరింత శాపంగా మరాయి. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రైతు భరోసా, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు, టెలిమెడిసిన్, సున్నా వడ్డీ, జగనన్న విద్యాదీవెన, వాహన మిత్ర, జగనన్న చేదోడు, అమ్మవడి తదితర పథకాల అమలుకు ప్రస్తుతం నిధుల లేమి కారణంగా అప్పులు తీసుకువచ్చి మరీ సంక్షేమ పథకాలను అర్హులకు అందే విధంగా చూస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు అవసరమైన మార్గాలను చూడాలని అధికారులకు సూచించారు.
ఈ నేపథ్యంలో కోవిడ్ కారణంగా పడిపోయిన ఆదాయాన్ని పెంచేందుకు గానూ సహజ వాయువుపై వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ సహజవాయువుపై 14.5 శాతం నుండి 24.5 శాతానికి విలువ అధారిత పన్ను పెంచతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున నిధులు కావాల్సి ఉన్నందు వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ జివోలో పేర్కొన్నది. ఇప్పటికే ఏపి ప్రభుత్వం అయిదు రకాల పెట్రో ఉత్పత్తులపై విలువ అధారిత పన్ను వసూలు చేస్తున్నది. ముడి చమురుపై 5శాతం మేర, పెట్రోల్ పై 31 శాతంతో పాటు అదనంగా నాలుగు రూపాయల మేర పన్ను వసూలు చేస్తున్నది. డీజిల్ పై 22.5శాతంతో పాటు అదనంగా నాలుగు రూపాయల మేర వ్యాట్ వసూలు, ఎయిర్ టర్బైల్ వ్యూయెల్ పై ఒక శాతం మేర వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ వసూలు చేస్తున్నది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్టు నెలలకు కరోనా కారణఁగా పన్నులపై ఆదాయం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులను కొంత మేర అధిగమించేందుకు సహజ వాయువుపై అదనంగా పది శాతం మేర వ్యాట్ పెంపునకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 4,480 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం 1,323 కోట్ల రూపాయల మాత్రమే ఆదాయం వచ్చింది.