(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసే విషయంలో విపక్షాల నుండి ఎన్ని విమర్శలు ఎదురైనా, హైకోర్టు సదరు జివోలను రద్దు చేసినా జగన్ ప్రభుత్వం ముందుకే సాగాలని నిర్ణయించుకున్నదా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన ప్రకటన, తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చూస్తే ఈ వాదానికి బలం చేకూరుతుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుకు ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన అమలు కోసం అవసరమైతే సుప్రీం కోర్టు కు వెళతామని మంత్రి ఆదిమూలవు సురేష్ ఇటీవల ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి అయిదవ తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు లేక సంరక్షకుల అభిప్రాయాలను తెలుసుకుని నివేదిక సమర్పించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలో నిర్ణయించుకునే హక్కు విద్యార్థుల తల్లిదండ్రులకే ఉందని ఏపి హైకోర్టు తన తీర్పులో వెల్లడించిన విషయం తెలిసిందే. దీనితో తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించనుంది. అభిప్రాయ సేకరణ తర్వాత ఈ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గతంలో పేరెంట్స్ కమిటీలు ఇంగ్లీష్ మీడియం విద్యా బోధనకు అనుకూలంగా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపగా, ఆ తీర్మానాలను ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. అయినప్పటికీ హైకోర్టు నుండి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
జగన్ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనుకుంది. ప్రతి ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ నాలుగేళ్లలో పదవ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలో రాసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అన్ని పాఠశాలల్లోనూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా కూడా చేసింది. ప్రతి మండల కేంద్రంలో ఒక తెలుగు మీడియం పాఠశాల కొనసాగించాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. నిర్బంధ ఇంగ్లీష్ మీడియం అమలు తగదంటూ విమర్శించాయి. మరో పక్క కొందరు తెలుగు భాషాభిమానులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కొందరు ఇంగ్లీష్ మీడియం అమలుపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా ఆ జీవోలను హైకోర్టు కొట్టివేసింది.
రాష్ట్రంలోని పేద వర్గాలు అందరూ ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనను స్వాగతిస్తున్నారని మంత్రి సురేష్ పేర్కొంటున్నారు. ఇంగ్లీష్ మీడియం అమలు విషయంలో తాము కట్టుబడి ఉన్నామని, చట్టపరంగా ఈ అంశంపై ముందుకు వెళతామని అయన స్పష్టం చేశారు.