(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఆమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని రైతాంగం పెద్ద ఎత్తున అందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా వైసిపి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. రాజధాని అమరావతి ప్రాంతాన్ని నగర పాలక సంస్థగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు లేకుండా పూర్తిగా మున్సిపల్ శాఖ పరిధిలోకి తెచ్చే ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా అమరావతి పరిధిలోని గ్రామాలకు ఎన్నికలు నిర్వహించవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది.
రాజధానిని విశాఖకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా ఆ ప్రాంత రైతులు నెల రోజులుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు, యువకులు ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు. రైతుల ఆందోళనకు ప్రధాన ప్రతిపక్షం టిడిపితో సహా బిజెపి, జనసేన, వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి.
రాజధాని విశాఖ తరలించడం ఖాయమనీ, ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నారనీ ప్రచారం జరుగుతున్నది. అందుకు అనుగుణంగానే జిఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ గ్రూపు నివేదికలు ఉన్నాయి. ఈ నివేదికలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ కూడా అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణకు అనుకూలంగా నివేదకను సిద్ధం చేస్తున్నది. ఈ నెల 20న జరగనున్న కేబినెట్ భేటీలో హైపవర్ కమిటీ నివేదికపై చర్చించి ఆమోదించనున్నారు. అదే రోజు అసెంబ్లీలో ఈ కమిటీ నివేదికపై చర్చించి రాజధాని, తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతాంగాన్ని శాంతపరిచేందుకు అధికారపక్షం వివిధ మార్గాలపై దృష్టి పెట్టింది.
అందులో భాగంగా రాజధాని పరిధిలో భూములిచ్చిన రైతులకు ఎకరాకు అదనంగా మరో 200 గజాల స్థలం ఇవ్వడం, రాజధాని ప్రాంతాన్ని నగర పాలక సంస్థగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నిర్ణయాలతో రైతులను శాంతపర్చవచ్చని భావిస్తున్నది. రాజధాని తరలించినప్పటికీ ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్న అభిప్రాయాన్ని రైతుల్లో కల్గించాలని ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చింది.
అమరావతి ప్రాంతం రాజధానిగా అయిదేళ్లకుపైగా ఉన్నా ఇప్పటి వరకూ మున్సిపాలిటీ లేదా నగర పాలక సంస్థగా గుర్తింపు రాలేదు. ఇంకా గ్రామాలుగానే కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ కూడా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుండి తాజాగా ఎన్నికల సంఘానికి ఎపి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది లేఖ రాశారు. రాజధానిపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజధాని గ్రామాలకు స్థానిక సంస్థల ఎన్నికల నుండి మినహాయించాలని కోరారు.
మరో పక్క రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పోరేషన్గా గుర్తించాలనీ, ఇతర మున్సిపాలిటీల్లో విలీనం చేయాలనీ ప్రతిపాదనలు పంపారు. ఎర్రబాలెం, బేతపూడి, నవులూరును మంగళగిరి పురపాలక సంఘంలో కలపాలనీ, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లిలో కలపాలనీ ప్రతిపాదించారు. మిగిలిన గ్రామాలన్నింటినీ కలిపి అమరావతి కార్పోరేషన్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం నిర్ణయం కీలకం కానున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజధాని గ్రామాల రైతులు ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.