అమరావతి: అసెంబ్లీ ఆవరణలో మార్షల్ను పరుష పదజాలంతో దూషించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ చేతికే ఇస్తున్నామనీ, సభాధ్యక్షుడు తన విచక్షణాధికారంతో ఆయనపై ఎటువంటి చర్య తీసుకోవాలో నిర్ణయించాలన్న తీర్మానాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. దీనికి వైసిపి సభ్యులు అందరూ ఏకగ్రీవంగా మద్దతు పలికారు.
తొలుత జరిగిన ఘటనలపై చంద్రబాబు విచారం వ్యక్తం చేయాలనీ, తద్వారా సభ సజావుగా సాగేందుకు సహకరించాలనీ స్పీకర్ చేసిన విజ్ఞప్తిని చంద్రబాబు అంగీకరించలేదు. తనకు జరిగిన అవమానానికి ఎవరు విచారం వ్యక్తం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మంత్రి బుగ్గన చంద్రబాబుపై చర్యలకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో పనిచేసే ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూ, వారికి భరోసాను ఇచ్చేందుకు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు చర్యలు అనివార్యమని బుగ్గన అన్నారు. బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, గొల్ల బాబూరావు, అంబటి రాంబాబు, ఆర్ వరప్రసాద్ తదితరులు బలపరిచారు.