అమరావతి: ఏపీ ప్రభుత్వానికి తెలియకుండా కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయా ?అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆళ్ళగడ్డలో యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నట్టు వస్తున్నవార్తల నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పవన్ వరుస ట్వీట్లు చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం కోసం డ్రిల్లింగ్ ప్రారంభమైందని ఓ జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ వార్తను ట్వీట్ చేసిన పవన్.. ‘‘ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం కోసం డ్రిల్లింగ్ జరుగుతోందని కథనాలు వస్తున్నాయి. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఏపీ ప్రభుత్వానికి తెలియకుండా ఇదెలా జరుగుతుంది? జిల్లా కలెక్టర్కు ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యం కలుగుతుంది’’ అని పవన్ ట్వీట్ చేశారు.
AP Govt should give a clarity, regarding the drilling for uranium in Allagadda( As the report says…). How come AP govt doesn’t have any clue about it? It’s surprising that dist collector doesn’t know about it.
— Pawan Kalyan (@PawanKalyan) September 29, 2019
నల్లమల అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రజలకు మద్దతు ఇచ్చేందుకు, వారితో కలిసి పోరాడేందుకు తాము ఉన్నామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నల్లమల అటవీ ప్రాంత పరిరక్షణ కోసం విమలక్క పాడిన పాట వీడియోతో పాటు యురేనియం డ్రిల్లింగ్ పనులకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ పాట ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
#SaveNallamala song by ‘Vimalakka’ for safeguarding Nallamala is quite inspirational. pic.twitter.com/4GmT7FL0aI
— Pawan Kalyan (@PawanKalyan) September 29, 2019
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేనాని గళం వినిపించిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ కాంగ్రెస్ నేతలతో కలిసి పవన్ డిమాండ్ చేశారు. దీంతో యురేనియం తవ్వకాలకు తాము అనుమతించలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తాజాగా ఇదే విషయమై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కల్యాణ్.
మరోవైపు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల కేంద్రం నుంచి మహానంది మండలంలోని గాజులపల్లి వరకు యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులు మొదలయ్యాయి. అణు విద్యుత్ కార్పొరేషన్ సంస్థ అధికారులు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. కర్నూలు జిల్లాలో నల్లమలకు ఆనుకొని ఉండే గ్రామాల్లో 15 చోట్ల యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులను చేపట్టారు. రాళ్లు, మట్టి లాంటి శాంపిళ్లను సేకరించడం కోసం 250 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేస్తున్నారు. అనంతరం వీటిని లాబొరేటరీకి పంపిస్తారు. నిర్దేశిత ప్రమాణాల మేరకు శాంపిళ్లలో యురేనియం ఆనవాళ్లు కనిపిస్తే.. అక్కడ తవ్వకాలు జరిపే అవకాశం ఉంది.