(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు సరఫరా పథకంలో ఏపి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రైతాంగానికి ఉచిత విద్యుత్ పథకాన్ని తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అమలులోకి తీసుకువచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉచిత విద్యుత్ పై సంతకం చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని కొనసాగించాయి. రాష్ట్ర విభజన తరువాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతూనే ఉన్నది.
నేరుగా రైతుల ఖాతాలోకి ఉచిత విద్యుత్ నగదు
అయితే జగన్మోహనరెడ్డి సర్కార్ ఈ స్కీమ్లో కీలక మార్పులు చేసింది. ఇకపై విద్యుత్ సబ్సిడీని నెల వారీ నేరుగా నగదు రూపంలో రైతులకు ప్రభుత్వం చెల్లించనున్నది. దీనిలో భాగంగా వ్యవసాయ కనెక్షన్కు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి రాష్ట్రంలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. స్మార్ట్ మీటర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగం మేరకు వచ్చిన బిల్లులను రైతులే డిస్కంలకు చెల్లించేలా కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు వ్యవసాయ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఉచిత విద్యుత్కి రూ.8400 కోట్లు ఖర్చు
నవరత్నపథకాల్లో భాగంగా ఉచిత విద్యుత్కు రూ.8400 కోట్లు ఖర్చు అవుతోందని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ పథకం కోసం రాష్ట్రంలో సుమారు 18లక్షల మంది రైతులకు ఏడాదికి 12వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వివరించింది. రానున్న 30 ఏళ్ల వరకూ రైతులపై భారం పడకుండా ఉచిత విద్యుత్ పథకం అమలుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో పదివేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపి ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. రూ.1700 కోట్లతో పగటి పూట 9గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేయడానికి వీలుగా సబ్ స్టేషన్ లను నిర్మించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది.
ఉచిత విద్యుత్కు మంగళం పాడేందుకు కుట్ర – సిపిఐ
అయితే ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ కీలక మార్పులను సిపిఐ తప్పుబడుతోంది. దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడేందుకు వైఎస్ జగన్ సర్కార్ చూస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. దశల వారీగా 18 లక్షల వ్యవసాయదారుల నోట్లో మట్టి కొట్టేందుకు జీవోలు తెస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు ఏపి ప్రభుత్వం గుడ్డిగా మద్దతు ఇస్తున్నదని విమర్శించారు రామకృష్ణ. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం మీటర్లు బిగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు రామకృష్ణ. ప్రభుత్వమే నేరుగా విద్యుత్ సంస్థలకు ఉచిత విద్యుత్ బిల్లులను చెల్లించకూడదా అని రామకృష్ణ ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ నుండి దశవారిగా తప్పుకునేందుకు నగదు బదిలీ కుట్రగా రామకృష్ణ అభివర్ణించారు. తక్షణమే ఈ జివోను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.