అమరావతి: అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటైన అయిదేళ్ళ తరువాత కూడా హైకోర్టు అంశంపై రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతిలోనే హైకోర్టు కొనసాగించాలని మధ్య కోస్తా ప్రాంత న్యాయవాదులు ఆందోళన చేస్తుండగా రాయలసీమ ప్రాంత న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క ఉత్తరాంధ్రకు చెందిన వారు వైజాగ్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని నినదిస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి మూడవ తేదీన రాజధాని అమరావతి ప్రాంతంలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. 819 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 12.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బౌద్ధస్తూపాకృతిలో హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణానికి 450 ఎకరాలను కేటాయించారు. దీనికి న్యాయనగరంగా నామకరణం చేశారు. నేలపాడులో నిర్మించిన హైకోర్టు తాత్కాలిక భవనంలో మార్చి 19వ తేదీ నుండి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాజధాని ప్రాంతంలో 25 శాతం కంటే తక్కువగా జరిగిన అన్ని అభివృద్ధి పనులను నిలిపివేశారు. దీంతో హైకోర్టు భవన నిర్మాణ పనులు కూడా ఆగిపోయాయి. దీనికి తోడు రాజధానిపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. అభివృద్ధి అనేది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ధ్యేయమని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు రాయలసీమలోని కర్నూలుకు తరలిస్తారని వార్తలు వచ్చాయి. దీంతో కోస్తాలోని ఐదు జిల్లాల న్యాయవాదులు అమరావతి నుండి హైకోర్టును తరలించడానికి వీలులేదంటూ ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు. ఇక్కడి న్యాయవాదుల ఆందోళనలు, నిరసనలు ఆగిపోవడంతో అటు ఉత్తరాంధ్ర. రాయలసీమల్లో న్యాయవాదులు ఆందోళనలు ప్రారంభించారు.
రాజధాని, హైకోర్టు విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మౌనం వీడాలనీ, లేకుంటే ఆయన ఇల్లు ముట్టడిస్తామనీ రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. కర్నూల్లోని రాయలసీమ యూనివర్శిటీలో విద్యార్థి, యువజన సంఘాల జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన యువగర్జనలో శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనీ జెఎసి నేతలు హెచ్చరించారు.
మరో పక్క విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర బార్ అసోసియేషన్ వైస్ చైర్మన్ మురళి, కార్యదర్శి కొండబాబుల నాయకత్వంలో న్యాయవాదులు బుధవారం నుండి విధులను బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. మూడు రోజుల పాటు నిరసన, ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటించారు.
హైకోర్టు విషయంపై ప్రభుత్వం నుండి ఇప్పటి వరకూ స్పష్టమైన వైఖరి వెల్లడికాలేదు. దీంతో మూడు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
సుప్రీం కోర్టు ఉత్తర్వులతో అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ చేతుల మీదుగా హైకోర్టు శాశ్వత భవన నిర్మాణాలకు భూమి పూజ జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంటుంది.