(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్పై ఎసిబి కేసు నమోదు చేసిన విషయంలో అనేక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఆయనపై నమోదు చేసిన కేసు వివరాలు నిన్న మధ్యాహ్నం పత్రికా ప్రకటన రూపంలో మీడియాకు వచ్చాయి. దీనితో సోషల్ మీడియా, వెబ్ మీడియాలలో ఆ వార్తలు ప్రధానంగా ప్రచురితం అయ్యయి. దీనితో స్పందించిన దమ్మాలపాటి శ్రీనివాస్ తనపై కేసు అక్రమంగా పెట్టారనీ, తనను అన్యాయంగా ఇరికిస్తున్నారనీ, తనకు సంబంధంలేని విషయాల్లో తనను లాగుతున్నారనీ పేర్కొంటూ తనపై ఎసిబి విచారణ జరగకుండా స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దానితో పాటు తనపై ఎటువంటి మీడియా వెబ్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఎటువంటి మీడియా విభాగాల్లోనూ ఆ కేసుకు సంబంధించి వార్తలు రాకుండా ఉండే విధంగా తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్గా దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు నిన్న రాత్రి తదుపరి చర్యలు నిలిపివేయాలని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఎఫ్ఐఆర్లోని సమచారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదంటూ హైకోర్టు ఆదేశించింది. దమ్మాలపాటి శ్రీనివాస్ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, శ్యాందివాన్లు వాదనలు వినిపించారు. దమ్మాలపాటిని ఇరికించేందుకు ఉద్దేశపూర్వకంగానే అభియోగాలు మోపారని అధారలతో సహా హైకోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాదులు వివరించడంతో హైకోర్టు వారి వాదనలతో ఏకీభవించి ఈ తీర్పు ఇచ్చింది. దీని పర్యవసానాల నేపథ్యంలో..
సమాచార శాఖకు లేఖ రాసిన డీజీపీ
హైకోర్టు తీర్పు నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. దమ్మాలపాటి శ్రీనివాస్పై ఎసిబి కేసు విషయంలో ఎటువంటి వార్తలు రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంటూ సమాచార శాఖకు డీజీపి గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రింట్, సోషల్ మీడియా ఏ విభాగాల్లోనూ ఎసిబి కేసుకు సంబంధించి వివరాలు రాకూడదని, దమ్మాలపాటి శ్రీనివాస్ కేసు విషయమై ఏటువంటి వార్తలు రాయకూడదని పేర్కొంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి నిన్న మధ్యాహ్నం ఎసిబి కేసు నమోదు విషయం బయటకు రావడం, పేర్లు అన్ని బయటకు రావడం, నిన్న రాత్రే శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించడం, వెంటనే హైకోర్టు విచారణకు స్వీకరించి తీర్పు ఇవ్వడం, తీర్పు నేపథ్యంలో పక్కాగా అమలు చేసేందుకు డీజీపీ సమాచార శాఖకు లేఖ రాయడం ఇదంతా గంటల వ్యవధిలోనే జరిగిపోవడం ఏపిలో కొత్త విషయాన్ని సృష్టించినట్లు అయ్యింది.