అమరామతి: పంచాయతీ కార్యాలయాలపై వైసీపీ రంగులను తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున పార్టీ రంగులు కార్యాలయాలపై తొలగించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని ధర్మాసనం తేల్చి చెప్పింది. కార్యాలయాలకు రంగుల తొలగింపు వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయానికి వైసీపీ రంగులు వేసిన సంగతి తెలిసిందే. జాతీయ జెండా రంగులను కూడా చెరిపేసి వైసీపీ రంగులు వేస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. పంచాయితీలకు రంగుల విషయంలో హైకోర్టు చేసిన అభిప్రాయాలు వైసీపీ నేతలకు చెంపపెట్టులాంటివన్నారు. ఇప్పటికైనా రంగుల రాజకీయాలు మానాలని హితవు పలికారు.