(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై విచారణను హైకోర్టు ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. గురువారం నాడు పిటిషన్లు విచారణకు రాగనే, బిల్లులు ఏ స్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్ జనరల్ (ఏజి) శ్రీరాం సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకె మహేశ్వరి ప్రశ్నించారు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయని ఏజి చెప్పారు. మండలిలో సెలక్ట్ కమిటీకి నివేదించారని ఆయన తెలిపారు. దాని నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు వివరించారు. బిల్లులపై ప్రస్తుతం విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడగా విచారణ జరగకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు తరలిస్తారనీ, విచారణ జరపాలనీ పిటిషన్ తరపు న్యాయవాది అశోక్భాను కోరారు. బిల్లులు చట్టంగా మారడానికి కనీసం నెల రోజుల సమయం ఉండటంతో విచారణను కోర్టు వచ్చే నెల 26వ తేదీకి వాయిదా వేసింది. బిల్లు చట్టంగా మారకుండా ఏవైనా విభాగాలను ప్రభుత్వం తరలిస్తే.. దాని ఖర్చును అధికారుల వ్యక్తిగత ఖాతాల నుంచి జమ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైతులకు తమ సమస్యలు తెలియజేయడానికి హైకోర్టు సమయమిచ్చినా, అంతలోపే సభలో ప్రభుత్వం బిల్లు ఎందుకు ప్రవేశపెట్టిందని ధర్మాసనం ప్రశ్నించింది.